మహాత్మా.. అనాథల్ని చేసి వెళ్లిపోయావా!! | Sakshi
Sakshi News home page

అయ్యో మహాత్మా.. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా!!

Published Thu, Oct 3 2019 4:14 PM

India Official Entry to Oscars should be this, Viral Video on Gandhi Jayanthi - Sakshi

‘అయ్యో.. మహాత్మా..  దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి.. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా.. ఇంత పెద్ద దేశానికి స్వాతంత్య్రాన్నిచ్చావు. మా కోసం, మా పిల్లల కోసం స్వతంత్ర దేశాన్ని ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్లిపోయారు. ఎందుకు త్వరగా వెళ్లిపోయారు’ అంటూ.. ఈ కింది వీడియోలో కనిపిస్తున్న నాయకులు వెక్కివెక్కి ఏడ్చారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ.. సదరు నాయకులు కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీ విగ్రహానికి తల ఆనించి.. కర్చీఫ్‌లు కళ్లకు అడ్డుపెట్టుకొని.. వెక్కివెక్కి ఏడ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

సమాజ్‌వాదీ పార్టీ సంబాల్‌ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ ఖాన్‌, అతని అనుచరులు ఇలా గాంధీ జయంతినాడు కన్నీరు కార్చారు. వీరు కన్నీరు కారుస్తున్న తతంగాన్ని అక్కడే ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘అబ్బా.. ఇది ఏమన్నా యాక్టింగ్‌. వీరిని ఉత్తమ నటుడి కేటగిరి కింద ఆస్కార్‌కు భారత్‌ తరఫున అధికారికంగా పంపాలం’టూ నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు. మహాత్ముడికి మనస్ఫూర్తిగా నివాళులర్పించడం వేరు.. మీడియా అటెన్షన్‌ కోసం, ప్రజల దృష్టిలో పడేందుకు ఇంతగా నటించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ వీడియోలో సదరు నాయకుల ఎడుపుగొట్టు ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే.. ఆస్కార్‌ అవార్డును స్వయంగా ఇంటికి మోసుకొచ్చి మరీ వీళ్లకు ఇస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా మంచు మనోజ్‌ కూడా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఎవర్‌ అంటూ ఈ వీడియోను రీట్వీట్‌ చేశారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లకు కితకితలు పెడుతోంది.

Advertisement
Advertisement