సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవడానికి ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరమని ప్రజా తెలంగాణ పార్టీ కన్వీనర్ గాదె ఇన్నయ్య అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల ఆశయాలను, ఉద్యమ ఆకాంక్షలను విస్మరిస్తున్న టీఆర్ఎస్కు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాలన్నారు.
నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును హరిస్తూ, ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టి అనైతిక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను అధికారం నుంచి దించాలన్నారు. తెలంగాణ వచ్చినా రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగుల బలిదానాలు, భూ నిర్వాసితుల సమస్య, సింగరేణిలో కార్మికుల ఇబ్బందులు కొనసాగడం బాధాకరమన్నారు. నిరుద్యోగులు, భూ నిర్వాసితులు, అణచివేతకు గురవుతున్న వర్గాలకోసం పోరాడుతున్న కోదండరాం నేతృత్వంలో పార్టీ రావడం అవసరమన్నారు.