సాక్షి, హైదరాబాద్: వేములవాడ నుంచి రెడ్డి ఐక్యవేదిక చేపట్టిన ర్యాలీని అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
రెడ్లలో దాదాపు 90శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, నిరుపేద రెడ్డి కులస్తులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం, పంటలకు గిట్టుబాటు ధర కోరడం అత్యాశ ఏమీ కాదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా అన్వయింప చేయాలని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలన్న డిమాండ్లతో ర్యాలీ చేపడితే అణచివేయడం ఏమిటని చాడ ప్రశ్నించారు.