సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంపై జననేన పార్టీ వివరణయిచ్చింది. నిర్దేశిత కాలపరిమితి కంటే ముందే ఎన్నికలు జరుగుతున్నందున పోటీ చేయడం లేదని తెలిపింది. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గడువు ప్రకారం జరిగితే ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించుకున్నామని, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్త పార్టీ అయిన జనసేనకు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోందని తెలిపారు.