సాక్షి, భూపాలపల్లి: ముందస్తు ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముందస్తు’అయినా.. జమిలి ఎన్నికలౖMðనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మొన్నటి వరకు ముందస్తుకు సిద్ధమని చెప్పి.. ఇప్పుడు ఎవరి కోసం అంటూ ప్రశ్నిస్తున్నారని, టీఆర్ఎస్ను ఎదుర్కోలేకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రగతి నివేదన సభ దేశ రాజకీయాల్లో మైలురాయిగా నిలుస్తుందని కడియం పేర్కొన్నారు. అయితే ఈ సభ ముందస్తు ఎన్నికల కోసం కాదని, ప్రజలకు రాష్ట్రం లో జరిగిన అభివృద్ధిని వివరించడానికే ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించకుంటే కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకుంటే మంచిదని హితవు పలికారు. భూపాలపల్లి నియోజకవర్గం టికెట్ వందశాతం మధుసూదనాచారికేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ జరిగిందని పేర్కొన్నారు.