కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. కమల్‌నాథ్‌కు పగ్గాలు! | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 26 2018 3:59 PM

Kamal Nath takes over as Madya pradesh PCC President - Sakshi

భోపాల్‌: గతకొంతకాలంగా సాగిన తర్జనభర్జనలకు తెరదించుతూ మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం పగ్గాలు అప్పగించింది. 2003 నుంచి కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో అధికారానికి దూరంగా ఉంది. పార్టీలో సీనియర్‌ నేతలు అనేకమంది ఉన్నా.. క్యాడర్‌ మాత్రం దినదినానికి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌.. పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కమల్‌నాథ్‌కు పగ్గాలు అప్పగించింది. 1970లో రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవముంది. అన్నింటికీ మించి సోనియాగాంధీకి ఆయన నమ్మిన బంటు.

పార్టీని పునర్నిర్మించి.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే తన ముందున్న అతిపెద్ద సవాలు అని నియామకం అనంతరం కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. పార్టీలో అందరూ తనకు స్నేహితులేనని, పెద్దలు, పిన్నలు, అందరినీ కలుపుకొని ముందుకువెళుతానని ఆయన చెప్పారు.

మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా కమల్‌నాథ్‌ నియామకం వెనుక దిగ్విజయ్‌సింగ్‌ హస్తమున్నట్టు భావిస్తున్నారు. డిగ్గి రాజా, కమల్‌ మంచి స్నేహితులు. కమల్‌ను దిగ్విజయ్‌ ‘సోదరుడి’గా చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఎదుగుతున్న జ్యోతిరాదిత్య సింధియాకు చెక్‌ పెట్టేందుకే దిగ్విజయ్‌ కమల్‌నాథ్‌కు అండగా నిలిచి.. పీసీసీ పగ్గాలు ఆయనకు దక్కేలా చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

1/1

సీనియర్‌ నేత కమల్‌నాథ్‌

Advertisement
Advertisement