కర్ణాటకం : అదే చివరి అస్త్రం.. | Sakshi
Sakshi News home page

కర్ణాటకం : చివరి అస్త్రంగా రెబెల్స్‌పై అనర్హత వేటు..

Published Tue, Jul 23 2019 4:10 PM

Karnataka Congress Chief Says Situation In The State Is Fit For Anti Defection Law - Sakshi

బెంగళూర్‌ : కన్నడ రాజకీయాలు నాటకీయ మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల వినతిని స్పీకర్‌ ఆర్‌ రమేష్‌ కుమార్‌ తోసిపుచ్చడంతో రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును చేపట్టేందుకు సంకీర్ణ నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితి ఫిరాయింపు నిరోధక చట్టం అమలుకు అనువుగా ఉందని కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావు అన్నారు. అనర్హత పిటిషన్‌పై తమ తరపున తమ న్యాయవాది స్పీకర్‌ ఎదుట పదునైన వాదన వినిపించారని చెప్పారు.

రెబెల్‌ ఎమ్మెల్యేలకు తమకు ద్రోహం తలపెట్టి అనర్హత వేటుకు గురయ్యేందుకు అర్హులయ్యారని అన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించేందుకు ఇది సరైన ఉదంతమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ గండంపై ఆందోళనతో కాంగ్రెస్‌ నేత, ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ వేదాంత ధోరణిలో మాట్లాడారు. బీజేపీ తీరును ఎండగడుతూ అందరం ఎప్పటికైనా తనువు చాలించాల్సిందేనని, మహా అయితే కొందరు రాత్రికి మరో రెండు పెగ్గులు అదనంగా తీసుకుంటారని అధికార దాహం తగదనే రీతిలో వ్యాఖ్యానించారు. ఇక విశ్వాస పరీక్షపై ఓటింగ్‌కు సంబంధించి స్పీకర్‌కు తాము ఆదేశాలు ఇవ్వలేమని రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం కోర్టు పేర్కొంది. బలపరీక్ష రెండ్రోజుల్లో జరుగుతుందని భావిస్తున్నామని, రేపు పిటిషన్‌పై విచారణను చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement