కోడెల అరాచకం.. వెలుగులోకి వీడియోలు! | Sakshi
Sakshi News home page

కోడెల అరాచకం.. వెలుగులోకి వీడియోలు!

Published Tue, Apr 16 2019 7:21 PM

Kodela Shivaprasada Rao Enters Polling Booth,  Video Came Out - Sakshi

సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు సృష్టించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలింగ్‌ సందర్భంగా తాను పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్ల గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లిన కోడెల శివప్రసాదరావు.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను బెదిరంచడమే కాకుండా.. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి వేసుకొని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్‌ రోజున ఇనుమెట్ల పోలింగ్‌ బూత్‌లో ఏం జరిగింది? కోడెల ఎలా అరాచకంగా ప్రవర్తించారో తెలియజేస్తూ.. తాజాగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లడమే కాకుండా.. అక్కడి వైఎస్సార్‌సీపీ ఏజంట్లను కోడెల వేలు చూపిస్తూ బెదిరించడం.. మీ అంతు చూస్తానంటూ హెచ్చరించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పోలింగ్ బూత్‌లోకి అనుచరులతో ప్రవేశించిన కోడెల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, పోలింగ్‌ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో కోడెల గన్‌మెన్ ఏకంగా పోలింగ్ కేంద్రం తలుపులు మూసివేశాడు. దాదాపు గంటపాటు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి కోడెల తలుపులు వేసుకోవడంతో ఇనుమెట్ల గ్రామంలో పోలింగ్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ప్రతిపక్ష నేతలు, స్థానికులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగుచూసిన వీడియోల సాక్షిగా కోడెల అరాచకం బయటపడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..
పోలింగ్‌ జరుగుతున్న సమయంలో కోడెల రాజుపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు. స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులేసుకొని ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించారు. ఈ క్రమంలో కోడెలపై దాడి పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు,  నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిపై కేసులు బనాయించిన సంగతి తెలిసిందే.

చదవండి: కోడెల సహా 22 మందిపై కేసు నమోదు

Advertisement
Advertisement