సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పచ్చిమోసకారి అన్న తన మాటపై నిలబడతానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ ద్రోహుల పార్టీనే అని, ఆ పార్టీ చరిత్ర మొత్తం కుట్రలు, మోసాలతో కూడుకుని ఉందన్నారు. 1952 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఒత్తిడి వల్లనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించిందని, ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.
‘తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యానానికి మంత్రి స్పందించి వరుస ట్వీట్లు చేశారు. ‘రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే తేలుస్తారు’ అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఆహ్వానించిన మంత్రి, ఇప్పటికే అనేకసార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.
ఎవరి పార్టీకి నైతికత లేదో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తా రన్నారు.టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా నని గతంలో చేసిన సవాలుకి కట్టుబడి ఉన్నానన్నారు. అయితే తన సవాలుకి తానుఎప్పుడూ కట్టుబడే ఉన్నానని, ఉత్తమ్ విషయం మాత్రం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. కచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని, ముందుగా ఆ విషయం తెలుసుకోవాలని అన్నారు.