ఝరాసంగం/న్యాల్కల్/జహీరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ధనాసిరి గ్రామంలోని దళితవాడలో పల్లెనిద్ర చేసిన ఆయన గురువారం ఉదయం జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా కూడా సరైన విధంగా లేదన్నారు. తాము పర్యటించిన గ్రామాల్లో ఎక్కడా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు కనిపించలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు పథకానికి కౌలు రైతులు నోచుకోవడం లేదన్నారు.
గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. అనేక పథకాలు కేంద్రం అమలుచేస్తున్నవే అయినా రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.