సాక్షి, హైదరాబాద్: బర్లు, గొర్లు, చీరలు పంచినంత మాత్రాన ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని, కుటుంబ పాలనను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీయడానికి జనవరి లేదా ఫిబ్రవరిలో లక్ష బైక్లతో ర్యాలీ నిర్వహిస్తామని, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జాతీయ సంఘటన కార్యదర్శి రాంలాల్ 3 రోజుల పర్యటన, పార్టీ సమీక్ష ముగిసిందని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత అమిత్ షా 3 రోజులు రాష్ట్రంలో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ నెల 14న నిజామాబాద్, 15న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సమీక్షిస్తారని చెప్పారు. ఈ నెల 21, 22న కరీంనగర్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.