న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్ సమావేశాల ఐదో రోజు కూడా పార్లమెంట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని లోక్సభ స్పీకర్ వెల్లోకి చొచ్చుకెళ్లారు. వారిని టీడీపీ ఎంపీలు కూడా అనుసరించారు. కార్యకలాపాలు సజావుగా నడపలేని స్థితిలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ సరిగ్గా ఇలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఎంపీల ఆందోళనలన నేపథ్యంలో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు.
ఓం శాంతి.. : శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే.. ఇటీవలే దివంగతులైన సభ్యుడికి లోక్సభ నివాళులు అర్పించింది. స్పీకర్ సూచన మేరకు ఎంపీలందరూ మౌనంపాటించారు. ఒక నిమిషం మౌనం పూర్తయిందనడానికి సంకేతంగా స్పీకర్.. ‘ఓం శాంతి.. ఓం శాంతి..’ అని పలికారు. ఆమె మాటలు పూర్తికాకముందే ఎంపీలు ఒక్కసారిగా నినాదాలు మొదలుపెట్టారు. ‘‘ఇప్పుడే ఓం శాంతి.. అంతలోనే హంగామానా?’ అంటూ స్పీకర్ విస్తుపోయారు! దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.