సాక్షి, పూణే: వధూవరులు లేనప్పటికీ.. పెళ్లికి సిద్ధమైనట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ ధోరణి అని బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక పుణె నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, ప్రచారాన్ని మాత్రం మొదలుపెట్టేసింది. మరోవైపు బీజేపీ ఇక్కడ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే అయిన గిరీష్ బాపత్ను బరిలోకి దింపింది. గిరీష్ ప్రచారంలో ముందుండగా ఆయనకు పోటీగా అన్నట్టు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ప్రారంభించింది.
పుణె టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. పార్టీ సిటీ చీఫ్ రమేశ్ బాగ్వేతోపాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ జోషీ, అరవింద్ షిండే, అభయ్ ఛాజెద్, ప్రవీణ్ గైక్వడ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎవరికి వారు తమ అనుచరులను వెంట పెట్టుకొని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు. టికెట్ రేసులో మోహన్ జోషితోపాటు అరవింద్ షిండే ముందున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండానే ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ప్రారంభించడంపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. వధూవరులు లేకుండానే పెళ్లికి సిద్ధమైనట్టు కాంగ్రెస్ ధోరణి ఉందని కమలనాథులు ఎద్దేవా చేస్తున్నారు.