‘వరదలను సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’ | Sakshi
Sakshi News home page

‘వరదలను సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’

Published Mon, Aug 19 2019 3:28 PM

Minister Anil Kumar Yadav Press Meet Over Krishna Floods - Sakshi

సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. వరద పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఆగస్టు 9వ తేదీన శ్రీశైలం, 12వ తేదీన నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామన్నారు. శ్రీశైలం నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు పేర్కొన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికతోనే నీటి విడుదల జరిగిందన్నారు. పదేళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరద వచ్చిందని గుర్తుచేశారు. గుంటూరులో 6వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని.. పూర్తి స్థాయి వరద నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు.

రాయలసీమకు పూర్తిస్థాయి నీటిని వినియోగించేందుకు కృషి​ చేస్తున్నామని తెలిపారు. రాయలసీమకు 35 టీఎంసీల నీటిని మళ్లించినట్టు చెప్పారు. వరదలకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయారని విమర్శించారు. నవంబర్‌ 1 నాటికి పోలవరం పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. బాధితులను ఆదుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేశారని అన్నారు. కానీ టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఒకరికొకరు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

Advertisement
Advertisement