సాక్షి, చిత్తూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందనతో టీడీపీ నేతలు భయపడి ఏదేదో మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను స్వయంగా చూశారు. ఆయన సీఎం అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. అందుచేతనే ఆయనను ప్రజలు దేవునిగా కొలుస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు.
పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా అంటూ చంద్రబాబు చేసిన మాటలు విడ్డురంగా ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో పాదయాత్ర చేసిన చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుని ఇప్పుడు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రామచంద్రారెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమం పులిచెర్ల మండలం కల్లూరులో నాలుగో రోజు కొనసాగుతోంది. కార్యక్రమంలో మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విద్యావేత్త జాయ్ జోసెఫ్ వైఎస్ఆర్సీపీలో చేరారు. పెద్దిరెడ్డి పార్టీ కోసం పని చేస్తున్న తీరు, వైఎస్ జగన్ మాటతీరు తాను వైసీపీలోకి రావడానికి కారణమని విద్యావేత్త జాయ్ జోసెఫ్ అన్నారు. జోసెఫ్ చిత్తరూతో పాటు, పాకాల, పెనుమురు, కల్లూరు, పీలేరులలో ఇండియన్ స్కూల్స్ ద్వారా సేవలందిస్తున్నారు.