సాక్షి, రాయచోటి: మాట తప్పం, మడమ తిప్పం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్తంలోనే ఉందని రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం ఆయనకి సాధ్యమన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర ఓ సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు.
పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యమని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు చేసిందేమీతేదని, అనవసరంగా ఉద్యోగస్తులను హైదరాబాద్ నుంచి తరలించి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, పార్టీ అధ్యక్షుడు నివాసం విజయవాడలోనే ఉంది కానీ సీఎం చంద్రబాబుకు విజయవాడలో స్థిర నివాసం ఏదీ లేదని తెలిపారు. రాజధాని పూర్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సధ్యమవుతుందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టునున్న విషయం తెలిసిందే. ఈ నెల 6 వ తేదిన ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. 3,000 కిలోమీటర్ల తన యాత్రలో దారి పొడవునా 45 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.