జలీల్‌ ఖాన్‌ను వెంటాడిన గతం.. కుమార్తెపై ఫత్వా

25 Feb, 2019 16:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ను గతం వెంటాడుతుంది. 2009 ఎన్నికల సమయంలో జలీల్‌ ఖాన్‌ అనుసరించిన వైఖరి.. ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌పై ఫత్వా జారీకి కారణమయింది. వివరాల్లోకి వెళితే.. అప్పటి ఎన్నికల సమయంలో జలీల్‌ ఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అప్పుడు కాంగ్రెస్‌ ఆ స్థానంలో మాజీ మేయర్‌ మల్లికా బేగంను బరిలోకి దించింది. దీంతో జలీల్‌ ఖాన్‌ ఆమెపై ఫత్వా జారీ చేసేలా మతపెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే కారణంతో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించారు. 

తనకు జరిగిన అన్యాయంపై మల్లికా బేగం తాజాగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫత్వా జారీ చేయడం వల్లే తాను అప్పటి ఎన్నికల్లో ఓడిపోయానని ఆరోపించారు. తనకులాగే షబానాపై కూడా ఫత్వా ఎందుకు జారీ చేయలేదని ముస్లిం మత పెద్దలను నిలదీశారు. ముస్లిం మహిళనని కూడా చూడకుండా జలీల్‌ ఖాన్‌ తనపై విషం కక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ముస్లిం ఓట్లు తనకు పడకుండా జలీల్‌ ఖాన్‌ మతంను అడ్డుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఫత్వా జారీ చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించిన జలీల్‌ ఖాన్‌.. తన కుమార్తెను ఎలా రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఆమె ప్రశ్నించారు. 

దీనిపై స్పందించిన మత పెద్దలు షబానాపై పత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. ఈ మేరకు మౌలానా అబ్దుల్‌ ఖదీర్‌ రిజ్వి ఈ నిర‍్ణయం తీసుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన జలీల్‌ ఖాన్‌.. తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు