సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏ మైకంలో ప్రధానిని అవమానించారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు కేటాయించినా అవి పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడకుండా చేసి ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం దారుణమన్నారు.
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏ శాఖ విషయంలో ఎంత ఉంటుందో కూడా తెలియని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. వ్యవసాయశాఖ విషయంలో రాష్ట్రానిదే ప్రధాన బాధ్యత అనే విషయం కూడా ఆయనకు తెలియకపోవటం దారుణమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవటంతో రావాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు. అలాగే ఫసల్ బీమా యోజన పథకం ప్రీమియం వాటా చెల్లించకపోవటంతో రైతులకు బీమా అందకుండా పోయిందని విమర్శించారు.