Sakshi News home page

ఈశాన్యంలో ‘మిషన్‌ 20’ సాధ్యం కాదు!

Published Wed, Apr 10 2019 7:46 PM

Not Possible MIssion 20 In Eastern States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ నాగాలాండ్‌ ప్రభుత్వంలో జూనియర్‌ భాగస్వామి మాత్రమే. మిగతా ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ ఉనికి అంతంత మాత్రమే. ఐదేళ్లు తిరిగే సరికి అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగా, నాగాలాండ్, మేఘాలయ ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామి అవడం అనూహ్య పరిణామం. కేంద్రంలో ఉన్న పార్టీయే అధికారంలో ఉంటే అభివద్ధి ఎక్కువగా జరుగుతుందీ, అభివద్ధికి ఎక్కువగా నిధులు వస్తాయన్న నమ్మకం అనే ఒక్క కారణంగానే ఆ రాష్ట్రాల ప్రజలు బీజేపీకి పట్టం కట్టలేదు. 

ప్రధాన భూభాగంపై నెరపిన హిందూత్వ రాజకీయాలే ఎక్కడ కూడా పనిచేశాయి. హిందువులకు భారత దేశం తమ పురిటిగడ్డ అన్న విశ్వాసం ఎక్కువ. అలాగే ఈశాన్య ప్రాంతాల్లో పలు జాతుల వారు క్రైస్తవులు అయినప్పటికీ తమ ప్రాంతం మీద మమకారం ఎక్కువ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపించాలన్నది వారి వాదన. ఈ మనోభావాలను బాగా అర్థం చేసుకున్న బీజేపీ స్థానికంగా బలమైన జాతుల భాగస్వామ్యంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో విజయం సాధించగలిగింది. 

ఆ విజయాలచ్చిన  ఊపుతో ఈశాన్య రాష్ట్రాల్లోని 25 లోక్‌సభ స్థానాలకుగాను కనీసం 20 సీట్లను సాధించాలనే లక్ష్యంతో ‘మిషన్‌ 20’ చేపట్టింది. ఒంటిరిగా వెళ్లితే అది సాధ్యమయ్యే పని కాదు. పైగా 2016లో పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో అది అసలు సాధ్యం కాదు. ఈ బిల్లును ఈ శాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వల్ల అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో స్థిరపడిన ముస్లిం యేతర హిందువులు అందరికి పౌరసత్వం లభిస్తుందికనుక. ఈశాన్య ప్రజలు ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లింలే కాదు, హిందువులను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు రాజ్యసభలో నిలిచిపోవడం వల్ల పార్లమెంట్‌ ఆమోదం పొందలేక పోయింది. ఈ విషయాన్ని ఈశాన్య ప్రజలు కూడా దాదాపు మరచిపోయారు. బీజేపీ మొన్న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం వల్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పౌరసత్వ సవరణ బిల్లుయే కాకుండా అస్సాం సిటిజెన్‌ బిల్లు, స్థానిక పరిస్థితుల కారణంగా పలు ఈశాన్య రాష్ట్రాల్లో పలు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు బీజేపికి దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో వాటి మద్దతును కూడగట్టుకోకుండా ‘మిషన్‌–20’ బిజేపీకి సాధ్యమయ్యే పనికాదు.

Advertisement
Advertisement