పాక్‌ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

పాక్‌ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

Published Mon, Oct 16 2017 8:41 PM

Pakistan Election Commission

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం తీవ్ర సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వివరాలు వెల్లడించని మొత్తం 261 మంది ప్రజాప్రతినిధులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన ప్రముఖుల్లో మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ సభ్యుడు కెప్టెన్‌ మహ్మద్‌ సఫ్దర్‌, పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన, ఎంపీ అయేషా గులాలయ్‌ మత వ్యవహారాల శాఖ మంత్రి సర్దార్‌ యూసఫ్‌, పార్లమెంట్‌ మాజీ స్పీకర్‌ ఫెహ్‌మిదా మిర్జా కూడా ఉన్నారు. ఈసీ వేటుకు గురైన వారిలో ఏడుగురు సెనేటర్లు, ఎంపీలు 71 మంది, పంజాబ్‌ అసెంబ్లీ సభ్యులు 84 మంది, సింధ్‌ అసెంబ్లీ సభ్యులు 50 మంది, ఖైబర్‌-ఫఖ్తున్‌ఖ్వాకు చెందిన 38 మంది, బలోచిస్తాన్‌ సభ్యులు 11 మంది ఉన్నారు.

ప్రజాప్రతినిధులు, వారి కుటుంసభ్యులు తమ ఆస్తుల వివరాలు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా వారి ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఎన్నికల సంఘం గడువు గతంలో విధించింది. అవినీతిని రూపు మాపుతానంటూ గత పాలకుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ తెచ్చిన ఈ చట్టంతో ఎటువంటి ప్రయోజనం లేదని ఇప్పటికే రుజువైందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులంతా ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాలను ఈసీకి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, సస్పెన‍్షన్‌కు గురైన వారంతా ఎన్నికల సంఘానికి తమ ఆస్తుల వివరాలు అందజేస్తే వారిపై ఎటువంటి చర్యలు ఉండవు.

Advertisement
Advertisement