భోపాల్: రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మచారిగా ఉండాలంటూ మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి పరాస్ చంద్ర జైన్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాంద్వలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ సలహా సూచించారు. అయితే ఆయనెందుకు పెళ్లి చేసుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అవివాహితులకు రాజకీయాల్లో అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు.
పెళ్లి చేసుకున్న వారికి ఓట్లేయొద్దు..!
ఆ కార్యక్రమంలో చంద్రజైన్ ఇంకా ఏమన్నారంటే.. పెళ్లి చేసుకోని వారిని మీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోండి. వివాహితులను ఎన్నుకుంటే వారు తమ కుటుంబం, ఇతర వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తుంటారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యేకొద్ది టెన్షన్ పెరగిపోతుంది. వారికి సంబంధాలు వెతకడం లాంటి పనులతో పదవులు, తమ బాధ్యత గురించి మరిచిపోతారు. అయితే అవివాహితులుగా ఉండిపోతే కేవలం దేశ సేవ కోసం ఆలోచిస్తారు. ఇవన్నీ కేవలం నా మనసులో మాటలు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా జీవిస్తున్నారు. కనుక ఆయన విజయాలు సాధిస్తున్నారు. మోదీ చేసే పనుల కారణంగా విదేశాల్లో భారతీయులకు గౌరవం దక్కుతోందని’ అభిప్రాయపడ్డారు.
మంత్రి పదవిని దుర్వినియోగం చేశారని, ఆయన కుటుంబ సభ్యులకే సోలార్ ప్లాంట్ కాంట్రాక్టు పనులు అప్పగించారని ఆరోపణలపై చంద్ర జైన్ స్పందించారు. కూతురు స్వాతి జైన్, కోడలు పూజా జైన్లు తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ కంపెనీని స్థాపించారని వివరణ ఇచ్చుకున్నారు. వ్యాపారం చేయడం నేరం కాదని, అన్ని టెండర్లు మా కుటుంబసభ్యులకు దక్కలేదని ఆరోపణల్ని తోసిపుచ్చారు.