సాక్షి, హైదరాబాద్ : అధికార తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఏదో ఎన్నికలప్పుడు మద్దతు ఇచ్చానేతప్ప తాను ‘టీడీపీ పార్ట్నర్’ను కానని తెలిపారు. సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పవన్.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన దిశగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విసిరిన సవాలుపై స్పందించారు.
అప్పుడే టీడీపీ లైన్ తెలుస్తుంది : ‘‘రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా కేంద్రంపై వైఎస్సార్సీపీనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అప్పుడు మాత్రమే టీడీపీ లైన్ ఏమిటనేది తెలుస్తుంది. వైఎస్సార్సీపీ తీర్మానం పెడితే.. నేనే స్వయంగా ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల మద్దతు కోరతా. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నందున ఇవే ఆఖరి బడ్జెట్ సమావేశాలు కాబట్టి.. ఇప్పుడే హోదా కోసం బలంగా పోరాడాలి. ఒకవేళ వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకుంటే ఎలాగూ టీడీపీకి అవకాశం దక్కుతుందికదా! ఇద్దరిలో ఎవరు ముందు తీర్మానం పెడతారో నాతోపాటు ప్రజలంతా ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు..’’ అని పవన్ పేర్కొన్నారు.
పరుగులు పెట్టిన పవన్ : అవిశ్వాస తీర్మానం పెట్టేలా లేదా తీర్మానానికి మద్దతు ఇచ్చేలా చంద్రబాబును ఒప్పించాలంటూ పవన్కు వైఎస్ జగన్ విసిరిన సవాలుకు జనసేన నుంచి బదులురాలేదు. స్పష్టమై సమాధానం చెప్పలేక పిల్లిమొగ్గలేసిన పవన్ కల్యాణ్.. తాను చెప్పదలుచుకున్నది గబగబా చదివేసి, బిరబిరా పరుగులు తీశారు. కనీసం విలేకరుల ప్రశ్నలకు బదులివ్వకుండా గబుక్కున వెళ్లిపోయారు. ప్రత్యేక హోదా పోరాటంలో అధికార పార్టీలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరినే.. వారి భాగస్వామి పవన్ కూడా మరోసారి బయటపెట్టుకున్నట్లయింది.