మూడు రాజధానుల విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్ కడప జిల్లాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వికేంద్రీకరణకు అడ్డు తగలకుండా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పూజలు చేశారు. పులివెందుల గుంత బజార్లోని మిట్టమల్లేశ్వరస్వామి ఆలయం, శివాలయంలో విద్యార్థులు, యువత పూజలు జరిపారు. కడప సీఎస్ఐ చర్చితోపాటు, డిగ్రీ కళాశాల రోడ్డులో గల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గృహ సముదాయంలో విద్యార్థులు దేవుని చిత్రపటాల వద్ద ప్రార్థనలు చేశారు. చంద్రబాబుకు సద్భుద్ధి ప్రసాదించాలని కోరుతూ అనంతపురం జిల్లాలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతపురం కోర్డు రోడ్డులోని ఆంజనేయస్వామి, రాయదుర్గం మండలం మల్లాపురం సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, కళ్యాణదుర్గం లక్ష్మీ వెంకటేశ్వరస్వామి, హిందూపురంలోని పేట వెంకటేశ్వరస్వామి, గుంతకల్లులో అభయాంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. హిందూపురంలోని హజరత్ మస్తాన్వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగాలమ్మకు, యాదమరిలో వరసిద్ధి వినాయకస్వామికి, ఏర్పేడు మండలం మర్రిమందలో గంగమ్మకు పూజలు చేసి చంద్రబాబుకు మంచిబుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు.
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి ఎమ్మెల్యే కంబాల జోగులు పూజలు చేశారు. పాలకొండలో కోట దుర్గమ్మకు, కవిటి మండలం బల్లిపుట్టుగ భవానీశంకర ఆలయం, ఎచ్చెర్ల, పాలకొండ, టెక్కలి నియోజకవర్గాల్లో ఆలయాల్లో పూజలు చేసి అభివృద్ధికు అడ్డు తగులుతున్న చంద్రబాబు మనసు మార్చాలని అమ్మవార్లను వేడుకున్నారు. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు.
‘చంద్రబాబు నామధేయస్య .. సద్బుద్ధి ప్రసాదస్య.. షోడశోపచార పూజాం కరిష్యే’ అంటూ రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో శనివారం పూజలు నిర్వహించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి విషయంలో మంచి బుద్ధి ప్రసాదించాలని, అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డు తగలకుండా చూడాలని ఆకాంక్షిస్తూ ఇష్ట దైవాలను ప్రార్థించారు. మసీదులు, చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
– సాక్షి, నెట్వర్క్
బాబు బుద్ధి మార్చాలని పూజలు, ప్రార్థనలు
వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లాలోని ఆలయాల్లో పూజలు నిర్వహించి.. చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. గుంటూరు అరండల్పేట సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ముస్తఫా టెంకాయలు కొట్టారు. బాపట్ల భావన్నారాయణస్వామికి పూజలు చేశారు. భట్టిప్రోలులో పూజలు చేసి చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు జరిపారు. నరసరావుపేటలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వినుకొండలో దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సందర్శించి మద్దతు తెలిపారు. పొన్నూరు వీరాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య పూజలు చేశారు. తెనాలిలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రకాశం జిల్లా కారంచేడు, అద్దంకి మండలం శింగరకొండ ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం ఆలయాల్లో పూజలు జరిపారు.