నిలకడగా కరుణానిధి ఆరోగ్యం: రాహుల్‌ పరామర్శ | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 7:47 PM

Rahul Gandhi Visits Karunanidhi - Sakshi

సాక్షి, చెన్నై : తీవ్ర అనారోగ్యానికి గురైన డీఎంకే అధినేత, కురువృద్ధుడు ఎం కరుణానిధి కోలుకుంటున్నారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌తోపాటు కరుణానిధి తనయుడు స్టాలిన్‌ కూడా ఉన్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల కిందట ఆయనను కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం కొంత కుదుటపడిందని, మరికొంతకాలం ఆయనను ఆస్పత్రిలో ఉంచాల్సిన అవసరముందని కావేరి ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు.

సామూహిక ప్రార్థనలు
కరుణానిధి త్వరగా కోలుకోవాలంటూ దక్షిణ భారత డబ్బింగ్ ఆర్టిస్టులు సామూహిక ప్రార్థనలు చేశారు. కావేరి ఆస్పత్రిలో ఉన్న కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉన్నా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుండి త్వరలో డిశ్చార్జ్‌ కావాలని వారు కోరుకున్నారు. ఈ సామూహిక ప్రార్థనల్లో ముస్లిం మత పెద్దలు ఖురాన్ చదివి అల్లాను ప్రార్థించగా.. క్రైస్తవ మతపెద్దలు బైబిల్ వాక్యం చదివి పాటలు పాడారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ చేశారు. ఈ కార్యక్రమంలో వందమందికిపైగా డబ్బింగ్ ఆర్టిస్టులు పాల్గొన్నారు

Advertisement
Advertisement