జాతీయ రహదారులు దిగ్బంధించిన వైఎస్సార్‌ సీపీ | Sakshi
Sakshi News home page

దీక్షకు మద్దతుగా జాతీయ రహదారుల దిగ్బంధం

Published Tue, Apr 10 2018 11:28 AM

Road blockade of National Highways - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధనం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చేపట్టిన నిరాహార దీక్షకు మద్ధతుగా ఏపీలోని పలు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయం నుంచి సోమవారం ప్రకటన వెలువడిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం నుంచే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీశ్రేణులు ఏపీలో రిలే నిరాహార దీక్షలకు దిగాయి. పలు నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు తీసి, మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపాయి.

నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు  రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో వారికి  మద్దతుగా నెల్లూరు జిల్లా  కొవ్వూరు మండలంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం చేశారు.

  • సూళ్లూరుపేట హోలీ క్రాస్ సెంటర్లో వైఎస్సార్‌సీపీ  ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం. రాస్తారోకో నిర్వహించిన నేతలు కళాత్తూర్ శేఖర్ రెడ్డి..వెంకట రమణా రెడ్డి...రాజా సులోచనమ్మ..తుపాకుల ప్రసాద్.
  •  నిరాహార దీక్షకు మద్దతుగా ఉదయగిరిలో మాజీ ఎంఎల్‌ఏ  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు.
  • ప్రత్యేక హోదా కోసం పొదలకూరులో సర్వేపల్లి ఎంఎల్‌ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
  • గూడూరు జాతీయ రహదారిపై వైఎస్సార్ సీపీ ఇంచార్జి మేరిగ మురళీధర్  ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు.

అనంతపురం:  తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ నేత పైలానరసింహయ్య చేపట్టిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆరోగ్యం క్షీణించినా ఆయన దీక్ష అలాగే కొనసాగిస్తున్నారు.

  • ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అంకోలా- నెల్లూరు జాతీయ రహదారిని గుంతకల్లులో కార్యకర్తలతో కలిసి వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
  • ఎంపీ ల దీక్షకు మద్దతుగా ధర్మవరం మాజీ శాసన సభ సభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆద్వర్యంలో చేపట్టిన  రిలే నిరహారదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
  •  ప్రత్యేక హొదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలకు మద్దతుగా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి.
  • ఎంపీల ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా గుత్తిలో బిక్షాటన చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు.
  •  హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు. 4వ రోజులో భాగంగా తుమకుంట చెక్ పోస్టు వద్ద రహదారుల దిగ్బంధం చేపట్టారు.
  • వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో రహదారులు నిర్బంధించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
  • బుక్కరాయసముద్రంలో హైవే దిగ్బందం. అనంతపురం-తాడిపత్రి మధ్య స్తంభించిన రాకపోకలు.  వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి సహా 100 మంది అరెస్ట్.

కృష్ణా జిల్లా : నందిగామలో ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆందోళనలో భాగంగా మంగళవారం నాడు జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమం ఉండటంతో పోలీసులు ముందస్తుగా ఇంటి వద్దనే హౌస్ అరెస్టు చేశారు. నందిగామ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మొండితోక జగన్ మోహన్‌తో పాటు మరి కొంత మంది నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  65వ నెంబర్ జాతీయ రహదారి దిగ్బంధం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

  •  ప్రత్యేక హోదా కోసం జగ్గయ్యపేటలో రహదారుల దిగ్బంధం చేసిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను గృహనిర్బంధం చేశారు.  ఇంటి నుంచి బయటకు వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ (చిన్న), నంబూరి రవిలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
  • గుడివాడలోని గాంధీ మండపంలో ఎమ్మెల్యే కొడాలి నాని  ఆధ్వర్యంలో మైనారిటీ నాయకుల  రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.

వైఎస్సార్ జిల్లా: ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గుంటి మడుగు సుధాకర్ రాజు ఆధ్వర్యంలో కడప- చెన్నై జాతీయరహదారి దిగ్బందం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

  •  ఆమరణ దీక్షకు మద్దతుగా బద్వేలులో పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్య౦లో చేపట్టిన రిలే రాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. అలాగే పోరుమామిళ్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూడా నాలుగోరోజుకు చేరుకున్నాయి.
  • వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి కడప-చెన్నై ప్రధాన రహదారిపై కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.


చిత్తూరు జిల్లా:  ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షలు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. సత్యవేడులో వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్యకర్త ఆదిమూలమ్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం జరిగింది.

  •  గుడిపాలలోని చెన్నై జాతీయ రహదారిపై పార్లమెంట్ యువజన విభాగం నాయకుడు మధుసూదన్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్భంధం కార్యక్రమం జరిగింది.
  • వైస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా పీలేరులో వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు సుంకర చక్రధర, ఎంపీపీ హరిత ఆధ్వర్యంలో కడప-చిత్తూరు జాతీయ రహదారి దిగ్భంధనం
  •  నగరిలో తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాస్తార కో చేపట్టారు
  •  వైఎస్సారీసీపీ ఎంపీలకు మద్దతుగా శ్రీకాళహస్తిలో పెండ్లి మండపము వద్ద రోడ్డుపై వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు  ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు.
  •  వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్ధుతుగా తిరుపతి ఎస్వీయూలో విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నిరసన. మద్దతుగా పాల్గొన్న ఎస్వీయూ ప్రొఫెసర్లు.

కర్నూలు జిల్లా:  బనగానపల్లె నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్వర్యంలో బనగానపల్లె పట్టణం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 4వ రోజు అవుకు మండల వైఎస్సార్ పార్టీ మహిళ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధం రెడ్డి రాం మోహన్ రెడ్డి, పీఆర్ వెంకటేశ్వర రెడ్డి, బండి బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ తదీతరులు పాల్గొన్నారు.

  • ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా ఆధోనిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు 167వ నెంబర్‌ జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా తదితరులు పాల్గొన్నారు.
  • ఆత్మకూరు పట్టణంలో ప్రత్యేక హోదా కొసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి దిగ్బందం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐల్యాండ్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అయిదవ రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.

  •  పెనుమంట్ర మండలం  మార్టేరు సెంటర్లో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్ధతుగా నాలుగో రోజు కొనసాగుతున్నదీక్షలు.  ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష. జాతీయ రహదారుల దిగ్బంధనం.
  • వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా పెదవేగి మండలం గోపన్నపాలెంలో దెందులూరు వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
  • పెదపాడు మండలం అప్పనవీడులో జాతీయ రహదారి దిగ్బంధం. కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ , వైఎస్సార్సీపీ నేతలు.

ప్రకాశం జిల్లా: యర్రగొండపాలెంలో ప్రత్యేక హోదా సాధనకై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు జాతీయ రహదారిపై దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు.

  • మార్కాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపురంలో జాతీయ రహదారి దిగ్బంధం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యమ్ షంషీర్ అలీ బేగ్, పట్టణ కన్వీనర్ బాల మురళీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు ఎన్ కొండయ్యలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
  • ప్రత్యేక హోదా సాధన విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరహారదీక్షలకు మద్దతుగా సంతనూతలపాడు బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుల ధర్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుంపా చెంచిరెడ్డి, కార్యకర్తలు.
  •  కొండపి ఎంఆర్‌ఓ ఆఫీసు ఎదురుగా కొండపి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ అశోక్‌ బాబు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు. భారీ స్థాయిలో పాల్గొన్న మహిళలు.
  •  కనిగిరి పీవీఆర్‌ పార్క్‌ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహరదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పాల్గొన్న నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ బుర్రా మదుసూదన్ యాదవ్, బన్ని, సరితా రెడ్డి, సుజాత, మాల్యాద్రి తదితరులు.
  •  వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా కంభం వై జంక్షన్ రోడ్డుపై దిగ్భందం చేసిన గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇంచార్జి ఐవీ రెడ్డి

తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాల్గోవ రోజు రిలే నిరాహారదీక్షలు. దీక్షలో పాల్గోన్న యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అనంత బాబు, సీతారామాంజనేయులు, దుర్గా ప్రసాద్ రెడ్డి,లింగం రవి,గాగరిన్,అడపా సుబ్బారావు.

  • ప్రత్యేక హోదా కోసం  ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలకు సంఘీభావంగా తుని గొల్లప్పారావు సెంటర్లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో  చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.  కార్యాకర్తలు16వ నెంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.
  • రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బొంతు రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో చించినాడ బ్రిడ్జి వద్ద రహదారి దిగ్భందనం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
  •  వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ ధీక్షకు సంఘీభావంగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం వద్ద జాతీయ రహాదారి దిగ్భంధం. నాల్గవ రోజు రిలేదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, కార్యకర్తలు.

విశాఖపట్నం జిల్లా : ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, సమన్వయకర్తలు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు ఆధ్వర్యంలో  పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో రాష్ట్ర  అదనపు కార్యదర్శి సీతారామరాజు, బోలిశెట్టి గోవిందు,దనిశెట్టి బాబూరావు, దగ్గుపల్లి సాయిబాబా  తదితరులు పాల్గొన్నారు.

  • ఎంపీలకు మద్ధతుగా  మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల జంక్షన్లో  వైఎస్సార్‌సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షకు దిగాయి.
  •  చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం పక్కన రిలే నిరాహార దీక్ష  చేపట్టారు. వీరికి మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రధాన కార్యదర్శి జొన్నాడ శ్రీనివాస్ రజకుల ఆధ్వర్యంలో చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి కొత్తూరు నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
  • నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి.
  • ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా  అనకాపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. కార్యకర్తలు మంగళవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రత్యేక హోదా నినాదాలు చేవారు.  ఈ రాస్తారోకో పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కళ్యాణి, గొల్లవిల్లి  శ్రీనివాస్, బీశెట్జి జగన్, జాజుల రమేష్, శ్రీధర్ రాజు, భూలోకనాయు, ఆళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
  • గాజువాకలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో  నిరాహార దీక్షలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి.

గుంటూరు జిల్లా : ఢిల్లీలో వైఎస్సార్‌సీపి ఎంపీల దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

  • సత్తెనపల్లి తాలూకా సెంటర్లో గుంటూరు-హైదరాబాద్ రహదారిపై అంబటి రాంబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
  • నరసరావుపేట శివారులో హైవేపై బైఠాయించిన నిరసన తెలిపిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
  • భట్టిప్రోలులో ప్రధాన రహదారిపై బైఠాయించిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, కార్యకర్తలు
  • బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో వెదుళ్లపల్లిలో జాతీయ రహదారిని దిగ్బంధించిన వైసీపి కార్యకర్తలు
  • చిలకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో నాలుగో రోజు రిలే నిరాహారదీక్షలకు కూర్చున్న కార్యకర్తలు
  • పొన్నూరు ఐలాండ్ సెంటర్లో రావి వెంకటరమణ ఆధ్వర్యంలో నాలుగవ రోజు చేరిన కార్యకర్తల రిలే నిరాహారదీక్షలు
  • గుంటూరు చుట్టుగుంట సెంటర్లో ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం. భారీగా నిలిచిపోయిన వాహనాలు
  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాలుగో రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు

విజయనగరం జిల్లా : ప్రత్యేక  హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా విజయనగరం జిల్లా కేంద్రంలో  కోలగట్ల వీరభద్ర స్వామి నేతృత్వంలో రహదారి దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అందుకే హోదా కోసం చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారని ఈ సందర్భంగా కోలగట్ల వ్యాఖ్యానించారు.

1/8

2/8

3/8

4/8

5/8

మార్కాపురంలో కార్యకర్తలతో కలిసి దిగ్భంధనం చేసిన ఎమ్మెల్యే జంకె

6/8

రాయచోటిలో రిలే నిరాహార దీక్షకు దిగిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

7/8

8/8

వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రాస్తారాకో

Advertisement
Advertisement