సాక్షి, హైదరాబాద్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. హోటల్ క్షత్రియలో మంగళవారం జరిగిన ప్రొఫెషనల్ కాంగ్రెస్ సభలో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్లు కుమ్మయ్యాయనీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని వ్యాఖ్యానించారు.
నోట్లరద్దు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని అన్నారు. కేంద్రం అధిక పన్నుల కారణంగానే పెట్రోలు ధరలు ఇంతలా పెరుగుతున్నాయని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాఫెల్ డీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.