సాక్షి, ముంబై: 2019లో జరగనున్న లోక్సభ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది. మంగళవారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.
బీజేపీ ప్రభుత్వం కేవలం పథకాల ప్రచారాలకు, ప్రకటనలకే డబ్బు ఖర్చు పెడుతోంది తప్ప చిత్తశుద్ధితో వాటిని అమలు చేయడం లేదనీ, ఇలాంటి పార్టీని అధికారం నుంచి దింపేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. హిందూ ఓట్లను చీల్చకూడదనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ మహారాష్ట్ర బయట పోటీ చేయలేదనీ, కానీ బీజేపీ వైఖరితో తాము విసిగిపోయామన్నారు.
మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘అసలు నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని)ను అహ్మదాబాద్కు తీసుకొచ్చి ఆయనతో గాలిపటాలు ఎగిరేయించడం ద్వారా ఏం సాధించారు? బదులుగా ఆయనను శ్రీనగర్కు తీసుకెళ్లి త్రివర్ణ పతాకాన్ని ఎగరేయించి ఉంటే దేశం గర్వించేది’ అని అన్నారు.