సుష్మా స్వరాజ్‌ నీకు ఇది తగునా.? | Sakshi
Sakshi News home page

సుష్మా స్వరాజ్‌ నీకు ఇది తగునా.?

Published Fri, Dec 29 2017 5:36 PM

 Sushma Swaraj ‘blocks’ Congress MP twitter account - Sakshi

న్యూఢిల్లీ :   ట్విట్టర్‌లో ప్రశ్నించినంత మాత్రాన అకౌంట్‌ను బ్లాక్‌ చేయడం తగునా.. అని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బజ్వా నిలదీశారు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌లను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. విదేశాంగ మంత్రి  తనని బ్లాక్‌ చేయడం ద్వారా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే  ప్రయత్నం చేస్తున్నారని,  ఏదైనా అంశం గురించి అడిగితే ఒక పార్లమెంటు సభ్యుని ఖాతాను బ్లాక్‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఒక మంత్రి వ్యవహరించే తీరు.. అని సుష్మా స్వరాజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

2014లో ఇరాక్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. గతంలో దీనిపై  సుష్మా స్వరాజ్‌ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఐసిస్‌ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన భారతీయులు బాదుష్‌ జైలులో ఉన్నట్టు ఇరాక్‌ అధికారులు సమాచారమిచ్చారన్నారు. అపహరణకు గురైన వారిని మరణించినట్లు ప్రకటించడం చాలా తేలికైన పనని, కానీ తాను అలా చేయబోనన్నారు. అలా చెప్పిన నన్నెవరూ ప్రశ్నించే వారు లేరన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా అలా చెప్పడం సమంజసం కాదన్నారు.

Advertisement
Advertisement