సాక్షి, హైదరాబాద్ : విశాఖ ఎయిర్పోర్టులో దుండగుడి చేతిలో గాయపడి ప్రస్తుతం సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నాలుగు నెలలుగా జరుగుతున్న డ్రామాలో భాగంగానే వైఎస్ జగన్పై దాడి జరిగిందని తలసాని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్మీట్ చూసి తాను షాక్ అయ్యానన్నారు. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పద విలో ఉన్న ఓ సీఎం మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే బాధ్యత వహించాల్సిన ప్రభుత్వంపై ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫోన్ చేసి పరామర్శ చేస్తే దానిగురించి ఏవేవో మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. ప్రత్యేక హోదా అడిగితే కేంద్రం కక్ష సాధింపునకు దిగుతోందని మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద బాబుపై దాడి జరిగితే ఆనాటి ప్రతిపక్షం స్పందించి పరామర్శిందన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న గవర్నర్ జరిగిన ఘటన గురించి డీజీపీతో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఘటన జరిగిన గంటలోనే డీజీపీ ప్రెస్మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.