సాక్షి, హైదరాబాద్ : ‘ నెలకిందట కూడా చంద్రబాబు అంత పనిచేస్తున్న వారు లేరు అని అన్నారు. ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నావు. పవన్ కల్యాణ్.. నువ్వు ఏ ప్యాకేజీకి అమ్ముడుపోయావో చెప్పు. ఎవరు డబ్బులిస్తే.. వాళ్లను పొగడటం నీకు అలవాటు. నువ్వు ఇంత మోసగాడివని అనుకోలేదు’ అంటూ తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సిహులు జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డారు. జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు, ఆయన తనయుడి అవినీతిపై పవన్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై మోత్కుపల్లి గురువారం స్పందించారు. ‘పవన్ కల్యాణ్ మాటలు దురదృష్టకరం, ఆయన మాట్లాడినతీరు బాధాకరం’ అని అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరు.. ఒక వార్ డుమెంబర్గా కూడా గెలవని వ్యక్తి.. రాష్ట్రం కోసం త్యాగాలు చేసినవారు కూడా ఇలా మాట్లాడరంటూ వ్యాఖ్యానించారు.
ముఖానికి వేసుకున్న రంగు చూసేందుకే ప్రజలు వస్తారు కానీ, ఓట్లు రావని, ప్రజారాజ్యం పరిస్థితి ఏమైందని ఆయన ప్రశ్నించారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్ననాడు.. నీ నీతి ఏమైంది.. టికెట్లు ఇచ్చేందుకు కోట్లరూపాయలు తీసుకున్నారు కదా గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల గురించే మాట్లాడే హక్కు పవన్కు లేదన్నారు. మీ అన్న చిరంజీవి పోటీచేస్తే 18 సీట్లు వచ్చాయి.. నువ్వు పోటీ చేస్తే ఎనిమిది సీట్లు కూడా రావు అని ఎద్దేవా చేశారు. శేఖర్ రెడ్డికి లోకేశ్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజకీయాలంటే సినిమా కాదని, మీ అన్నలాగే, నువ్వు విఫలమవుతావని పవన్ ఉద్దేశించి పేర్కొన్నారు. పవన్ చేత బీజేపీ మాట్లాడిస్తోందని చిన్నపిల్లలను అడిగినా చెప్తారని పేర్కొన్నారు. ప్రధానిని కలిసే అవకాశం ఉన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్పై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ బయటపెడితే ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సిహులు