ఏలూరు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర పశ్చిమలో శనివారం నుంచి యథాతథంగా జరగనుంది. నిడదవోలు నియోజకవర్గం కానూరు క్రాస్ రోడ్డు నుంచి శనివారం ఉదయం 7.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. వైఎస్ జగన్ పాదయాత్ర ఆయా గ్రామాల గుండా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగనుంది. శనివారం సాయంత్రం నిడదవోలు పట్టణంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. అందులో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. ప్రజాసంకల్ప పాదయాత్ర మునిపల్లి, పెండ్యాల క్రాస్రోడ్డు, కలవచర్ల, డి.ముప్పవరం మీదుగా కొనసాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ మధ్యాహ్న విరామానికి వెళతారు. అక్కడి నుంచి సమిశ్రగూడెం మీదుగా పాదయాత్ర నిడదవోలు పట్టణానికి చేరుకుంటుంది. అక్కడ సభ అనంతరం వైఎస్ జగన్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
పశ్చిమలో జగన్ జైత్రయాత్ర
వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు జనం జేజేలు పలుకుతున్నారు. పాదయాత్ర మే నెల 13వ తేదీన పశ్చిమలోకి ప్రవేశించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 11నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. దెందులూరు నియోజకవర్గం పెదఅడ్లగాడ గ్రామం వద్ద వైఎస్ జగన్ జిల్లాలోకి ప్రవేశించారు. అనంతరం ఏలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఏలూరు వెంకటాపురం పంచాయతీ పరిధిలో జగన్ 2వేల కిలోమీటర్ల పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం దెందులూరు, గోపాలపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఉండి, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు నియోజవకవర్గాల్లో పాదయాత్ర అప్రతిహతంగా సాగింది. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి జగన్ పాదయాత్రకు నిరాజనాలు పలికారు.
ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ సమస్యలను వైఎస్ జగన్కు విన్నవిస్తూ తమ బాధలు చెప్పుకుంటూ ఆయనతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో 12వ నియోజకవర్గం నిడదవోలులో శనివారం జగన్ పాదయాత్రకొనసాగుతుంది. అనంతరం కొవ్వూరు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుంది. మొత్తం మీద జగన్ పాదయాత్ర జిల్లాలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలు మినహా 13 నియోజకవర్గాల గుండా ముందుకు వెళ్ళనుంది. అక్కడి నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. .