గ్రామాల అభివృద్ధిని మరిచారు | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధిని మరిచారు

Published Thu, May 3 2018 10:26 AM

TRS Leader Bandla Krishna Mohan Reddy Criticize On Congress Party - Sakshi

గద్వాల రూరల్‌ : కాంగ్రెస్‌ నాయకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ధరూరు మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగ్లా కుటుంబం గద్వాల ను నలబై ఏళ్లు పాలించిందన్నారు. వీరంతా దౌర్జన్యాలు, హత్యారాజకీయాలతో రాజ్యాధికారం సంపాదించారని విమర్శించారు.

కాంగ్రెస్‌ హయాంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జేబులు నింపుకొన్నారే తప్పా ఏనాడూ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో గద్వాల అభివృద్ధికి రూ.28కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.26కోట్లు, బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు, ప్రతి మండలానికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేయించామన్నారు. కాగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ధరూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజులపాడు రఘురెడ్డి, గువ్వలదిన్నె సర్పంచ్‌ సిద్ధన్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసులుగౌడ్, మాజీ సర్పంచ్‌ లక్ష్మీనారాయణ, పాగుంట సింగిల్‌విండో డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు ఈర్లబండ శ్రీనివాస్‌రెడ్డి, రాజారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ సుభాన్, ధరూరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, గట్టు మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు విజయ్‌ కుమార్, గద్వాల మార్కెట్‌ యార్డు వైస్‌చైర్మన్‌ నజీర్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమేష్‌నాయుడు, ఆయా గ్రామ సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, ఉరుకుందు, రామకృష్ణ, దామ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement