మరింత ముదురుతున్న సంక్షోభం | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 10:57 AM

UN Warns Maldives crisis may get worse - Sakshi

వాషింగ్టన్‌ : మాల్దీవుల అంతర్గత సంక్షోభం మరింత ముదురే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్‌ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో ఐరాస విభాగం భద్రతా మండలి అత్యవసర భేటీని నిర్వహించింది. 

ఇప్పటిదాకా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ.. మున్ముందు మాత్రం పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని భద్రతా మండలి సహాయక కార్యదర్శి జనెరల్‌ మిరోస్లేవ్‌ జెంకా వెల్లడించారు. ఇక మరోవైపు మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిపై ఐరాస ప్రధాన కార్యదర్శి జెనెరల్‌ అంటోనియో గుటెర్రెస్ స్పందించారు. తక్షణమే ఎమర్జెన్సీని ఎత్తివేయాలని ఆయన అధ్యక్షుడు యెమీన్‌ను కోరుతున్నారు. ప్రజాస్వామ్యంపై ఇది దాడి చేయటమేనని చెబుతున్న ఆంటోనియో.. పరిస్థితి మరింత క్లిష్టంగా మారకముందే త్వరపడాలని అంటున్నారు.

ట్రంప్‌-మోదీ ఫోన్‌ సంభాషణ... 
మాల్దీవుల సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీలు చర్చించారు. ఈ మేరకు వైట్‌హౌజ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘గురువారం వీరిద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం త్వరగా ముగియాలని ఇద్దరు కోరుకున్నారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. 

అఫ్ఘనిస్థాన్‌ యుద్ధం, రోహింగ్యా శరణార్థుల సమస్యలపై కూడా వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.

 
                                  అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌-భారత ప్రధాని నరేంద్ర మోదీ

సంక్షోభం ఎలా మొదలైంది... 
బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తిరిగి దేశానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రతిపక్షానికి చెందిన 9 మంది నేతలను వెంటనే విడుదల చేయాలని గతవారం మాల్దీవుల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. కానీ ఈ తీర్పును అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ ఖాతరు చేయలేదు. ప్రతిపక్ష నేతలను విడుదల చేసేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో వివాదం మొదలైంది. న్యాయస్థానం తీర్పుతో చివరకు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు దాపురించటంతో జడ్జిలనే అరెస్ట్‌ చేయించిన అధ్యక్షుడు అబ్దుల్లా.. తర్వాత అత్యవసర పరిస్థితిని విధించారు.


                                      భద్రతా సిబ్బంది నడుమ అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్‌

Advertisement
Advertisement