తొలి ఫైల్‌పై సంతకం చేసిన మోదీ | Sakshi
Sakshi News home page

తొలి ఫైల్‌పై సంతకం చేసిన మోదీ

Published Fri, May 31 2019 7:10 PM

Union Minister First Meeting After Ministers Take Charge - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేం‍ద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది. దేశ రక్షణ నిధి నుంచి అమరులైన సైనికుల పిల్లలకు ఇచ్చే ఉపకారవేతనాలను పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు రెండువేల నుంచి 2500కు, విద్యార్థినులకు 2250 నుంచి 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు, రాష్ట్రంలో అమలు అయ్యే పోలీసు కుటుంబాలకు కూడా ఈపథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారి నుంచి ఇకపై ఎంపిక చేయనున్నారు.

మొదటి సమావేశంలోనే బడ్జెట్‌
ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్‌ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. నూతన ప్రభుత్వంలో జూన్‌ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్‌ తొలి సమావేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి మండలి నిర్ణయించింది. జూన్‌ 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. మొదటి సమావేశంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భేటీలో నిర్ణయించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
తొలి సంతకం చేసిన నరేం‍ద్ర మోదీ

ప్రధాని మోదీతో సహా.. కేంద్ర మంత్రులుగా పలువురు గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారందరికీ శుక్రవారం శాఖలను కేటాయించారు. మంత్రులు ఆయా శాఖల బాధ్యతలను చేపట్టిన మరుక్షణమే ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర మంత్రిమండలి సమావేశమయింది. దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి పథంలో నడిపించాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులనందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. 

Advertisement
Advertisement