ఇదే చంద్రబాబు అసలు కడుపుమంట: విజయసాయి రెడ్డి | Sakshi
Sakshi News home page

ఇదే చంద్రబాబు అసలు కడుపుమంట: విజయసాయి రెడ్డి

Published Thu, May 9 2019 6:30 PM

Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతూ.. క్యాబినేట్‌ సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తానన్న చంద్రబాబుకు సోషల్‌ మీడియా వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ్‌సాయి రెడ్డి తనదైన శైలిలో చురకలంటించారు. మరో పదిహేను రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందనగా సమాచార కమిషనర్ల ఎంపికపై చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్‌పై వత్తిడి తేవడం దారుణమన్నారు. ఐదేళ్లు నిద్రపోయి ఆఖరి నిమిషంలో కమిషనర్ల నియామకం జరపడం అనైతికతకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. నియామకాలను ఆమోదించకుండా కొత్త ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నర్‌ను కోరారు.

నక్క జిత్తుల రాజకీయాలకు మరో వందేళ్ల పేటెంటు మీదే చంద్రబాబూ అంటూ ఎద్దేవా చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారిని నక్సల్ హతమారిస్తే, కొడుకు శ్రావణ్ ను మంత్రిని చేశారని, 6 నెలల గడువు ముగిసిందని గుర్తు చేశారు. తండ్రిలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నోడివి లోకేశ్ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్ కు ఎందుకివ్వలేక పోయావ్? అని నిలదీశారు.

సొంత జిల్లా రైతులను నిలువునా ముంచిన చరిత్ర చంద్రబాబుదంటూ విమర్శించారు. తన హెరిటేజ్ కంపెనీ కోసం చిత్తూరు డెయిరీని మూసివేయించారని ఆరోపించారు. వేరుశెనగ విత్తనాల సబ్సిడీ పథకం కింద బాబు మిత్రులైన వ్యాపారులు రూ.13.5 కోట్లు దిగమింగారని విజెలెన్స్‌ శాఖ తేల్చిందన్నారు. ఎలక్షన్‌ కోడ్‌ రక్షణలో ఎస్పీ ధైర్యంగా బయట పెట్టారని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో చీఫ్ సెక్రటరీ కాంట్రాక్టర్ల బిల్లుల పేమెంట్స్‌కు కొన్ని నిబంధనలు సూచించారని.. ఈ రూల్స్‌తో బాబుకు ఎన్నికల ఫండింగ్ చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు ఆగి పోయాయని అన్నారు. ఇదే చంద్రబాబు అసలు కడుపుమంట అని పేర్కొన్నారు. కేబినెట్ మీటింగ్ పేరుతో దీనిపైనే రచ్చచేయాలని చూస్తున్నారని అన్నారు. తాత్కాలిక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి చాంబర్లోకి వర్షం నీళ్లు వరదలా కారితే.. మేమే రధ్రం పొడిపించామని ఆరోపించారు చంద్రబాబు.. దర్యాప్తు కూడా జరిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు చిన్నపాటి గాలి వానకే హైకోర్టు అద్దాలు పగిలాయి, షెడ్లు ఎగిరి పోయాయని.. ఇది ఈసీ, చీఫ్ సెక్రటరీల కుట్ర అంటారేమో? అని దుయ్యబట్టారు.
 

Advertisement
Advertisement