సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు నెరవేర్చాలంటే ఆరు రాష్ట్రాల బడ్జెట్ కావాలని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవ చేశారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో పాటు ఆయన వందలాది మంది అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. వైశ్యులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ, వ్యాపారం చేసుకుంటూ అందరితో మంచిగా ఉంటారని ప్రశంసించారు. కానీ గీత గీయాల్సినప్పుడు టీఆర్ఎస్ వైపే నిలబడతారని పేర్కొన్నారు. ఆపద్దర్మ సీఎం కేసీఆర్ రైతు కాబట్టి ప్రతీ రైతుకు న్యాయం జరిగిందని, కొన్ని తరాల కోసం ఆలోచించే నాయకుడని అభివర్ణించారు. తెలంగాణ కోసం కారిన ప్రతీ కన్నీటి చుక్క విలువ కేసీఆర్కు తెలుసన్నారు.
అక్కడెందుకు ఇవ్వటం లేదు?
కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలంటే అర్రాస్ పాట అనుకుంటుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ రూ.1000 పింఛన్ ఇస్తే కాంగ్రెస్ రూ.2000 ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. మరి పంజాబ్, కర్ణాటకలో కేసీఆర్ లేరు కాబట్టి పింఛన్ రూ.2000 ఇవ్వటం లేదా అని ప్రశ్నించారు. ఓట్లను తొలగించడం కేసీఆర్కు ఏం అవసరమని, ఎక్కువ ఉంటే టీఆర్ఎస్కే ఎక్కువ మెజార్టీ ఉంటుంది కదా అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ క్రికెట్ టీం లాగా ఒక్కరికి కూడా ఇంటి పక్కోడు కూడా ఓటు వేయడని ఎగతాళి చేశారు. కానీ కాంగ్రెస్ నేతల్లో ప్రతీ ఒక్కరికీ సీఎం సీటే కావాలని చురకలంటించారు.