9న రాష్ట్రపతిని కలుస్తాం | Sakshi
Sakshi News home page

9న రాష్ట్రపతిని కలుస్తాం

Published Wed, Nov 7 2018 4:33 AM

Will meet the President with 9th says Mithun Reddy - Sakshi

బి.కొత్తకోట: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని రాష్ట్రపతికి విన్నవిస్తామని రాజంపేట మాజీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఈనెల 9న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బృందం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. మంగళవారం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కుర్రావాండ్లపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం హత్యాయత్నం ఘటనను చిన్నదిగా చూపించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎవరో అమాయకుడు చేసిన ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని థర్డ్‌పార్టీ విచారణ కోరుతున్నామని చెప్పారు. విమానాశ్రయంలో లైటర్లు, కత్తులను తీసుకెళ్లే వీల్లేదని, అలాంటప్పుడు హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి విమానాశ్రయంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

హత్యాయత్నంలో తమ ప్రయేయం లేదని ప్రభుత్వం చెతున్నా థర్ట్‌పార్టీ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఏ సిద్ధాంతం కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారో వాటికి పూర్తి విరుద్ధంగా సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో అపవిత్ర పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అధికారం కోసమే చంద్రబాబు విలువల్లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పొత్తును భరించలేక టీడీపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పార్టీలను వీడుతున్నారని తెలిపారు. మాజీ మంత్రులు సి.రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్‌ కాంగ్రెస్‌ను వీడారని గుర్తు చేశారు. 36 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన జిల్లాలో పేరున్న కొండా కుటుంబం ఆ పార్టీని వీడిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయనపై నమ్మకంతో తమ పార్టీలోకి రావాలని టీడీపీని వీడిన వారిని ఆహ్వానించారు.
 

Advertisement
Advertisement