సాక్షి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్రను జననేత ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
ఈ రోజు పాదయాత్రలో ఛీడిగా మీదుగా ఇంద్ర పాలెం చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కాకినాడ ఏఆర్సీ సెంటర్, సంతచెరువు, కల్పన సెంటర్, కోకిల సెంటర్ మీదుగా ఆదిత్యా కళాశాల సెంటర్ వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జననేత ఇప్పటివరకు 2,550.9 కిలోమీటర్లు నడిచారు.
పాదయాత్రలో భాగంగా కొవ్వాడ చేరకున్న వైఎస్ జగన్ను గంగనాపల్లి గ్రామ దళితులు కలిశారు. తమ గ్రామంలో అధికార టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు రోడ్డు వేయటం లేదని, దళితుల స్మశానవాటికను అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా ఆక్రమించారని జననేత దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజల సమస్యలు వివరంగా తెలుసుకున్న రాజన్న బిడ్డ అధికారంలోకి రాగానే తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలారు.