సాక్షి, అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకవుతూ ముందుకు సాగుతోన్న జననేత జగన్ పాదయాత్రలో భాగంగా నేడు (గురువారం) 400 కిలో కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. బుధవారం నాటికి 396.9 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్, జిల్లాలో నేడు నాలుగోరోజు పాదయాత్రలో భాగంగా గుమ్మేపల్లి వద్దకు రాగానే 400 కి.మీ మైలురాయిని చేరుకుని అక్కడ మొక్కలు నాటారు. పాదయాత్రలో అరుదైన మైలురాయిని చేరుకున్న జననేత జగన్కు మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. మరో ఏడాది ఆగితే రాజన్న రాజ్యం వస్తుందంటూ ఉత్సాహంతో ప్రజలు యాత్రకు మద్ధతుగా నిలుస్తున్నారు.
ఈ నెల 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి, డోన్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన 21వ రోజు పాదయాత్రలో భాగంగా జననేత జగన్ నేడు 300 కిలోమీటర్ల మైలు రాయిని కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్న జననేత నేడు 29 రోజు పాదయాత్రలో భాగంగా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు. జననేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీ సంఖ్యలో అనంతపురం జిల్లా వాసులు పాదయాత్రలో భాగస్వాములు అవుతుండటం గమనార్హం.