సాక్షి, నెల్లూరు: ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి (సోమవారం) సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో వైఎస్ జగన్ పాదయాత్ర శిబిరం వద్ద ఈ సమావేశం జరగనుంది. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో అధినేత వైఎస్ జగన్ సమావేశమై.. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం తదితర అంశాలపై చర్చిస్తారు.
రాష్ట్ర ప్రయోజనాలను గత నాలుగేళ్ళుగా తాకట్టు పెడుతూ వచ్చిన టీడీపీ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆఖరి ఏడాది, ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొద్దిరోజులుగా పార్లమెంటు వేదికగా డ్రామాలు ఆడుతుండటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాను భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా.. ఏదో సాధించేసినట్టు టీడీపీ నేతలు చేస్తున్న హడావుడి, సంబరాలపై ఈ భేటీలో చర్చ జరగనుంది. అలాగే, ప్రత్యేక హోదానే రాష్ట్రానికి సంజీవని అంటూ గత నాలుగేళ్ళుగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించటంపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు.