సాక్షి, ప్రొద్దుటూరు : వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆరో రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర అమృతనగర్కు చేరుకోగా.. అక్కడి చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ చేశారు.
రుణాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని.. పిల్లలను చదవించుకోలేనపోతున్నామని చేనేత కార్మికులు జగన్ దగ్గర వాపోయారు. వారిని అన్ని విధాల ఆదుకుంటానని భరోసా ఇచ్చి ఆయన.. సత్వర పరిష్కార సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలంటూ స్థానిక నేతలకు వైఎస్ జగన్ సూచించారు. ఆపై మగ్గం యంత్రాన్ని ఆయన స్వయంగా కాసేపు నేశారు. అంతకు ముందు తనను కలిసిన సీపీఎస్ఈఏ సంఘం సభ్యులకు సీపీఎస్ విధానం రద్దు చేయాలన్న డిమాండ్కు వైఎస్ జగన్ స్పష్టమైన మద్దతు ప్రకటించారు. మరోవైపు పలువురు ఆటో డ్రైవర్లు కూడా ఆయన్ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
చంద్రబాబుది లంచాల ప్రభుత్వం : జగన్
పేదలకు ఉపయోగపడే పనులు ఒక్కటీ చేయకుండా.. కేవలం లంచాలు వచ్చే పనులను మాత్రమే చంద్రబాబు సర్కార్ చేస్తోందని వైఎస్ జగన్ తెలిపారు. ఎక్కడికెళ్లినా తమకు పెన్షన్లు రాలేదని చెబుతున్నారని.. వైఎస్సాఆర్సీపీ అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ పెన్షన్లు అందిస్తామని ఆయన ప్రకటించారు.
ఇంకా ఆయనేం చెప్పారంటే... పేదరికం పోవాలంటే అందరూ చదువుకోవాలి. స్కూల్కి వెళ్లే పిల్లకు నగదు సాయం అందిస్తాం. ఉన్నత చదువులు చదువుకునే వారికి ఫీజు మొత్తం రీఎంబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తాం. ప్రత్యేక హోదా వస్తేనే పన్ను రాయితీలు వచ్చి.. ఉద్యోగాల కల్పన పెరుగుతుంది. వేల కోట్ల పెట్టుబడులు వస్తే అందరికీ ఉపాధి కలుగుతుంది. తద్వారా నిరోద్యోగ సమస్య లేకుండా పోతుంది.అందుకే ప్రత్యేక హోదా పోరాటానికి అంతా ముందుకు రావాలి అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.