సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు మడమతిప్పని పోరాటం చేస్తున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సమరశంఖం పూరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎంపీలతో లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా వైఎస్ జగన్ వెల్లడించారు.
‘కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామ’ని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటీసును కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు ఆయన స్వయంగా లేఖలు కూడా రాశారు. ఈ లేఖలను వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నాయకులను కలిసి అందజేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమతో కలిసి రావాలని వివిధ రాజకీయ పార్టీలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
YSR Congress Party moves the No Confidence Motion against the Central Government. For the rights of the people of Andhra Pradesh, we will continue our fight for the Special Category Status. pic.twitter.com/EypdpDCRsI
— YS Jagan Mohan Reddy (@ysjagan) 15 March 2018