సాక్షి, తూర్పు గోదావరి : సంఘమిత్ర, వీఏవో, వెలుగు యానిమీటర్స్కు అధికారంలోకి వచ్చిన నెలకు 10 వేల రూపాయలు వేతనం ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరిలో జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో సంఘమిత్రలు, వీఏవోలు, వెలుగు యానిమీటర్స్ వైఎస్ జగన్కు కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు.
డ్వాక్రా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ఏకరవుపెట్టారు. తమతో అన్ని పనులు చేయించుకుంటూ జీతాలు మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకే వేతనాలను పెంచాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. వేతనాలు ఇవ్వడం వల్ల డ్వాక్రా సంఘాల్లోని సంఘమిత్రలు, వీఏవోలు, వెలుగు యానిమీటర్స్ లబ్ధి పొందుతారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రకటనపై వారు హర్షం వ్యక్తం చేశారు.