Sakshi News home page

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: అనిల్‌ యాదవ్‌

Published Tue, Apr 2 2019 4:52 PM

YSRCP Anil Kumar Yadav Fires On Narayana and Yellow Media - Sakshi

సాక్షి, నెల్లూరు : ఎన్నికలు సమీపిస్తుండటంతో పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. గతేడాది ఓ సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్‌ చేసి తనని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లాభపడేందుకే మంత్రి నారాయణ, ఎల్లో మీడియా చేసిన కుట్రని ఆరోపించారు. ఆ సమావేశంలో యుద్ధరంగంలో మాదిరిగా ఎన్నికల్లో పోరాడాలని కార్యకర్తలను పిలుపునిచ్చారనని, దమ్ముంటే తాను మాట్లాడిన పూర్తి వీడియోను పెట్టాలన్నారు. నారాయణకు ఓటమి భయం పట్టుకుందని, దీంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసలు నారాయణకు మానవత్వం ఉందా..? అని ప్రశ్నించారు.

నారాయణను తాను ఏ రోజు వ్యక్తిగతంగా విమర్శించలేదని, నారాయణ వైద్య కళాశాల్లో ఆయన కూతురు కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థిని మరణిస్తే అక్కడే ఉన్న నారాయణ కనీసం పరామర్శించలేదన్నారు. ఈ వీడియోపై పోలీసులకు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతున్నారనే బాధతో వైఎస్సార్‌సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నడిరోడ్డులో ఒక తహసీల్దారుపై దాడి చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ గురువారం (ఏప్రిల్‌ 4న) నెల్లూరుకు వస్తున్నారనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement