సాక్షి, హైదరాబాద్ : బీజేపీ నేతలతో మీటింగ్పై వస్తున్న వార్తలు అబద్ధమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల మీద ఢిల్లీకి వెళ్లానని, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ విప్ కూన రవికుమార్ను ఏపీ భవన్లో కలిస్తే మీడియా తనకు తోచిన విదంగా కథనాలు రాస్తోందని ఎమ్మెల్యే బుగ్గన మండిపడ్డారు. ఇలాంటి రాతలు, అనైతిక రాజకీయాలు, జర్నలిజంతో తెలుగు జాతి పరువుతీస్తున్నారంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. ఏపీ భవన్లో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారని, టీడీపీ విప్, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడితే, టీడీపీ విప్తో కలిసిన విజువల్స్ కట్ చేసి బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి ఉన్న వీడియోలు మాత్రమే ప్లే చేస్తూ మీడియా చూపిస్తోందని అన్నారు.
టీడీపీ విప్ కూడా నన్ను ఆలింగనం చేసుకున్నారని అయితే ఆయన వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టా అని ప్రశ్నించారు. దేశ రాజధానిలో రాష్ట్రానికి చెందిన అతిథి గృహంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలుసుకుని మట్లాడుకుంటే దాని చుట్టూ కట్టుకథ అల్లడం టీడీపీ ఎంతటి అభద్రతా భావానికి లోనవుందో చెప్పడానికి నిదర్శనమని అన్నారు. అచ్చెన్నాయుడు మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదు, ఆయనకు మెదడు లేదని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ ట్వీట్లు చూస్తే..తనకున్న పప్పు బిరుదును పోగొట్టుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లే ఆటలో దిగినట్టుందని విమర్శించారు. టీడీపీ నాయకుల మానసికి స్థితి ఉన్మాదానికి చేరిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీవ్ర ఒత్తిడి, గందరగోళం, అయోమయంలో ఉన్నారని ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు.