సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, బీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవకాశవాదానికి నిజమైన అర్థం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని, ఆయన పాలనే రాష్ట్రానికి దురదృష్టకరమని ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్ధాల వల్లే రాష్ట్రానికి వచ్చే నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకొని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.
హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా కావాలని మేం అడిగితే ...చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టంలో ఉంటే కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం పనులు చేపట్టారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సహా దేన్నీ పట్టించుకోలేదు. రాష్ట్రానికి లక్షలకోట్ల పెట్టుబడులు వచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు.
నాలుగేళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు డ్రామాలాడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని...మేం నాలుగేళ్లుగా చెప్పినా పట్టించుకోలేదు. పైపెచ్చు మాపైనే నిందలు వేశారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీల వేషాలు చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారు. వారి ప్రవర్తనతో తెలుగు జాతికి మాయని మచ్చ తెస్తున్నారు. డ్రామాలు వేయడం, గుండు కొట్టుకోవడం కాదు..చిల్లర వేషాలు వేయడం మానేసి..రాష్ట్రానికి ఏం కావాలో డిమాండ్ చేయండి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోండి. ఇక రాష్ట్ర జీడీపీఐ చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలే.’ అని అన్నారు.
టీడీపీ కూటమి నుంచి పవన్ ఎప్పుడు బయటకొచ్చారు?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ కూటమి నుంచి ఎప్పుడు బయటకొచ్చారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పవన్ ఇంకా టీడీపీతో కలిసే ఉన్నారని మేం అనుకుంటున్నాం. అనంతపురంలో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. అనంతపురం జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటే కలెక్టర్ను కలిసి వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది. దానికోసం టీడీపీ నేతలను కలవాలా?. టీడీపీ నుంచి బయటకొస్తే పవన్ కల్యాణ్ గురించి ఆలోచిస్తాం. ఒకేవేళ నిజంగా జేఏసీ ఏర్పాడాలంటే ముందు అందులోకి టీడీపీఆ రావాలి. అసలు పవన్ కల్యాణ్ ఎజెండా ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.’ అని అన్నారు.