ఆరు దాటితే కమీషన్ల లెక్కల్లో చంద్రబాబు | Sakshi
Sakshi News home page

ఆరు దాటితే కమీషన్ల లెక్కల్లో చంద్రబాబు

Published Mon, Sep 25 2017 3:19 AM

Nallapareddy prasanna kumar reddy - Sakshi

సాక్షి, కోవూరు: సీఎం చంద్రబాబు మంచి నాటకాలరాయుడని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు రామాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఉదయం ఒక జొన్న ఇడ్లీ, టీ, మధ్యాహ్నం రాగిసంగటి, సాయంత్రం ఒక పండు, ఒక గుడ్డు ఆహారంగా తీసుకుంటానని చెప్పారన్నారు. అయితే సాయంత్రం ఆరు గంటలు దాటితే తండ్రీకొడుకులు కూర్చొని రోజువారీ కలెక్షన్లు, కమీషన్ల లెక్కలు చూసుకుంటూ కడుపు నింపుకుంటున్నారని విమర్శించారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు పర్యటనల కోసం ప్రైవేట్‌ హెలికాప్టర్‌కు రూ.14.33 కోట్లు ఖర్చు చేయడాన్ని కాగ్‌ విమర్శించిందని చెప్పారు.

రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఎక్సైజ్‌ శాఖల్లో అంతులేని అక్రమాలు జరిగినట్లు కాగ్‌ తన నివేదికలో పేర్కొందన్నారు. దీనికి ప్రధాన కారకులు సీఎం చంద్రబాబేనని చెప్పారు. నెల్లూరు జిల్లాలో నీరు–చెట్టు కార్యక్రమంలో చోటుచేసుకున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. సైకోలా ప్రవర్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌కు సీఎం చంద్రబాబుకు తేడా లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నలబోలు సుబ్బారెడ్డి, జిల్లా నాయకులు మల్లికార్జునరెడ్డి, నిరంజన్‌ బాబురెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బరామిరెడ్డి, సర్పంచ్‌ దేవేంద్రమ్మ పాల్గొన్నారు.

Advertisement
Advertisement