సాక్షి, శ్రీకాకుళం : విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా తప్పని సరని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సంజీవని వంటిదని అభిప్రాయపడ్డారు. కేంద్రం బడ్జెట్లో ప్యాకేజీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ముఖ్యమంత్రికి కనీసం చీమకుట్టినట్లుగానైనా లేదని మండిపడ్డారు.
బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి రావలసిన నిధులను రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని విజయసాయి రెడ్డి విమర్శించారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీపై ప్రధాని మోడీకి అవగాహన ఉండటం వల్లే నిధులు ఇవ్వడానికి విముఖంగా ఉన్నారని తెలిపారు. రైతులకు మద్దతు ధర విషయంలో కేంద్రం ఆలోచించాలని సూచించారు. ఒక్కో ఏడాది మద్దతు ధర 20శాతం పెంచితేనే రైతులకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.