ఫొటో షూట్‌ కోసమే ఢిల్లీకి... | Sakshi
Sakshi News home page

ఫొటో షూట్‌ కోసమే ఢిల్లీకి...

Published Thu, Apr 5 2018 1:50 AM

YSRCP MPs fires on CM Chandrababu Delhi tour - Sakshi

సాక్షి, నూఢిల్లీ: నాలుగేళ్లు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఏనాడూ నోరెత్తి అడగలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విమర్శించారు. ఇప్పుడు హామీల సాధన పేరుతో ఫొటో షూట్‌ కోసం ఢిల్లీకి వచ్చారని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు వ్యక్తిత్వం, నిజాయితీ లేదు కాబట్టే ఢిల్లీలో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ మినహా ఇతర అన్ని పార్టీల నేతలను కలుస్తామని చెప్పిన చంద్రబాబు పార్లమెంట్‌కు వచ్చేలోపే మాట మార్చి బీజేపీ ఎంపీలను ఎలా కలుస్తారని వారు నిలదీశారు. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చి, తన పరపతిని ఉపయోగించి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా మంత్రాంగం సాగిస్తారని భావిస్తే అదేదీ జరగలేదు’’ అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement