మభ్యపెట్టడంలో బాబు దిట్ట | Sakshi
Sakshi News home page

మభ్యపెట్టడంలో బాబు దిట్ట

Published Wed, Feb 28 2018 1:04 PM

YSRCP training camps in east godavari - Sakshi

సామర్లకోట (పెద్దాపురం) ప్రజలను మభ్య పెట్టేలా ప్రచారం చేయడంలో చంద్రబాబును మించినవారు మరొకరు ఉండరని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెద్దాపురం–జగ్గంపేట రోడ్డులోని పామాయిల్‌ తోటలో మంగళవారం జరిగిన జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కన్వీనర్‌ ముత్యాల శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా భజన చేస్తున్నారని ఆరోపించారు. మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తోందన్నారు.   జన్మభూమి కమిటీల ద్వారా సర్పంచ్‌లకు అన్యాయం జరుగుతోందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. అర్హులైనవారిని ఓటర్లుగా నమోదు చేయిం చేందుకు ప్రతీ బూత్‌కు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతీ 100 మందిలో ఇద్దరు వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులను గుర్తించాలన్నారు.

వారి ద్వారా 100 మంది అవసరాలు బూత్‌ కమిటీకి తెలిసేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా ప్రతి బూత్‌ కమిటీ ఒక ప్రణాళిక తయారు చేసి నియోజకవర్గ కన్వీనర్‌తో జిల్లా స్థాయికి అందజేయాలన్నారు. ప్రతీ బూత్‌లోను ఏఏ వర్గాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడంతో పాటు వారి పేర్లను నిద్రలో అడిగినా చెప్పే విధంగా బూత్‌ కమిటీ సభ్యులు ఉండాలన్నారు. బూత్‌ కమిటీ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రభుత్వం కనిపించకుండా చేసిందని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లతో పాటు గృహనిర్మాణ పథకాలను ప్రారంభిస్తున్నారని.. ఈ విషయం ప్రజలు జాగ్రత్తగా గమనించాలన్నారు. ఇవి కూడా  అర్హులకు అందడం లేదన్నారు. అర్హులను గుర్తించి ఈ పథకాలు అందే విధంగా బూత్‌ కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు.

కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ విజయానికి బూత్‌కమిటీ సభ్యులు సైనికులుగా పని చేయాలన్నారు. ప్రజలను పార్టీ వైపు తిప్పే బాధ్యత బూత్‌ కమిటీ సభ్యులు స్వీకరించాలన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాసు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డితోనే  వైఎస్సార్‌ పాలన సాధ్యమవుతుందన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి మాఫియా దోచేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అధికారపార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసమే జగన్‌

మోహన్‌రెడ్డి నవరత్న పథకాలను ప్రకటించారన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు, కర్రి వెంకట రమణ, మోరంపూడి శ్రీరంగనాయకులు, వరసాల ప్రసాద్, మేడిశెట్టి వీరభ్రదరావు, ఏపీజే వెన్ను, గవరసాని సూరిబాబు, నియోజకవర్గ నాయకులు తాటికొండ అచ్చిరాజు, మద్దాల శ్రీనివాసు, కాపుగంటి కామేశ్వరరావు, బొబ్బరాడ సత్తిబాబు, బంగారు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement